Sri Krishna Janm Ashtami, Birthday of Sri Krishna


Sri Krishna Janmashtami 2020: ఇది శ్రీకృష్ణుడి ఎన్నో జన్మదినమో తెలుసా?


శ్రీకృష్ణ జన్మాష్టమినే...  గోకులాష్టమి అని కూడా అంటారు. నందగోపాలుడి జన్మదినం సందర్భంగా...

భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం... భాద్రపద మాసంలో...

కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం...

ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అంటే... 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు లెక్క. ఓ గోపాలుణ్ని పూజిస్తూ...

ఈ పండుగ నాడు ప్రతి ఇంట్లో పిల్లల్ని బాలకృష్ణుడిలా అలంకరిస్తారు. ప్రతీ సంవత్సరం కృష్ణాష్టమి తేదీ మారుతూ ఉంటుంది. ఎక్కువగా రెండు రకాలుగా ఇది జరుగుతూ ఉంటుంది. మొదటిది స్మార్థ సంప్రదాయం, రెండోది వైష్ణవ సంప్రదాయం. కృష్ణ జన్మాష్టమిని అష్టమి రోహిణీ, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. దృక్ పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం ఆగస్ట్ 11న కృష్ణాష్టమి.



నిషిత పూజా సమయం : 12:05 AM నుంచి 12:48 AM August 12, 2020 వరకు. (మొత్తం 43 నిమిషాలు)

దహి హండి బుధవారం (August 12, 2020) ఉంటుంది.

అష్టమి తిథి ఆగస్ట్ 11న 09:06 AM కి మొదలవుతుంది.అష్టమి తిథి ఆగస్ట్ 12న 11:16 AM కి ముగుస్తుంది.

పురాణాల ప్రకారం... మథురను పాలించే కంసుణ్ని చంపేందుకే శ్రీకృష్ణుడు పుట్టాడు. కంసుడి చెల్లెలైన దేవకికి పుట్టాడు బాలగోపాలుడు. కంసుడి స్నేహితుడైన వసుదేవుడికే దేవకిని ఇచ్చి పెళ్లి చేశాడు కంసుడు. ఆ తర్వాత వారికి పుట్టే ఎనిమిదో సంతానం... కంసుణ్ని చంపుతుందని ఆకాశవాణి చెప్పడంతో... కంసుడికి ఒళ్లు మండుతుంది. దేవకి, వసుదేవుణ్ని జైల్లో పెట్టి... వారికి పుట్టే పిల్లలందర్నీ చంపుతూ వస్తాడు. ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు... వసుదేవుడు... ఆ గోపాలుణ్ని.. బృందావనం తీసుకెళ్లి... నందుడు, యశోద దంపతులకు ఇస్తాడు. తిరిగి మధుర వచ్చి... తమకు ఎనిమిదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందనీ... ఆమెను చంపవద్దని కోరతారు. కానీ కంసుడు ఒప్పుకోడు. ఆడపిల్లను చంపేందుకు యత్నిస్తాడు. దాంతో ఆ పాప... దుర్గాదేవి అవతారంలో కనిపించి... నీ పని అయిపోయినట్లే అని హెచ్చరిస్తుంది. కొన్నేళ్ల తర్వాత కృష్ణుడు పెద్దవాడే... మధురకు వచ్చి... కంసుణ్ని చంపుతాడు. దాంతో మథుర ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది.

కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు.. ఉదయం వేళ పూజలు చేసి... సంకల్పం చెప్పుకుంటారు.

పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు.

కృష్ణాష్టమి సందర్భంగా... దేశవ్యాప్తంగా దహీ హండీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. తెల్లటి వెన్న, పెరుగు, పాలను కుండలో ఉంచి... దానికి తాడు కట్టి... దాన్ని ఎవరు టచ్ చేయగలరో చెయ్యమంటారు. ఇదో ఆసక్తికర అంశం.

మర్నాడు సూర్యోదయం తర్వాత భక్తులు ఉపవాస దీక్షను విరమిస్తారు. ఏకాదశి దీక్షలకు ఎలాంటి రూల్స్ పాటిస్తారో... జన్మాష్టమి ఉపవాసానికీ అవే రూల్స్ పాటిస్తారు.


Post a Comment