magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-

పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు.

కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.

Post a Comment